Q1 ఫలితాలు కీలకం

21 Jul, 2014 01:49 IST|Sakshi
Q1 ఫలితాలు కీలకం

 న్యూఢిల్లీ: దేశీ కంపెనీల తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్’14) ఫలితాలు, విదేశీ సంకేతాలే సమీప కాలంలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. గడచిన వారం ఉక్రెయిన్-రష్యా సరిహద్దులో మలేసియా విమానం కూల్చివేతపై చెలరేగిన ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని నిపుణులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.

దీంతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకోనున్న పరిణామాలపై మార్కెట్లు దృష్టిపెడతాయని విశ్లేషకులు వివరించారు. ఇవికాకుండా విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు కూడా కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. వీటికితోడు దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైనా ఇన్వెస్టర్లు కన్నేస్తారని వ్యాఖ్యానించారు.

 నిఫ్టీ 7,700 దాటితే...: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ నిఫ్టీకి ఈ వారం 7,700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ తెలిపారు. అంచనా వేశారు. ఈ స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాలను తట్టుకుని ముందుకుసాగితే కొనుగోళ్లు పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. గడచిన వారం కనిపించిన సానుకూల సంకేతాలతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 617 పాయింట్లు(2.5%) ఎగసిన విషయం విదితమే.
 
 రూపాయి ఎఫెక్ట్...
 దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపనుండగా, అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సైతం కీలకంగా నిలుస్తాయని స్టాక్ నిపుణులు విశ్లేషించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ ఆందోళనకర స్థాయిలో మందగించిన రుతుపవనాలు వేగం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవలి వరకూ కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వర్షాలు ఆశలు రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంతోపాటు పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ర్ట, కచ్ ప్రాంతాలకు విస్తరించడం గమనార్హం.

 దిగ్గజాల ఫలితాలు...
 ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, ఐడియా సెల్యులర్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ ఉత్తమ ఫలితాలతో జోష్‌నివ్వడంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. అయితే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ఇజ్రాయెల్, పాలస్తీనా ఆందోళనల కారణంగా ఈ వారం మార్కెట్లు దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిపెడతారని చెప్పారు.

 విదేశీ గణాంకాలు..
 అంతర్జాతీయంగా ఈ వారం పలు గణాంకాలు వెలువడనున్నాయి. చైనా తయారీ గణాంకాలు(హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ), అమెరికాకు చెందిన రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ), గృహాల అమ్మకాలు, మన్నికైన వస్తువుల ఆర్డర్లు వంటి అంశాలు వెల్లడికానున్నాయి. కాగా, దేశీయంగా కీలక గణాంకాలేవీ విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో విదేశీ అంశాలే కీలకంగా నిలవనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ తెలిపారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లను నడిపిస్తాయని చెప్పారు.

 ఈ నెలలో పెట్టుబడి రూ. 22,000 కోట్లు
 దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 22,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. జూలై 19 వరకూ నికరంగా 367 కోట్ల డాలర్లను(రూ. 22,023 కోట్లు) ఇన్వెస్ట్‌చే యగా, ఈక్విటీలకు 180 కోట్ల డాలర్లను(రూ. 10,755 కోట్లు) కేటాయించారు. దీనికి అదనంగా 189 కోట్ల డాలర్ల(రూ. 11,268 కోట్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. కేంద్రంలో ఏర్పడ్డ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఎజెండా ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

మరిన్ని వార్తలు