కొత్త రైళ్లతో రైల్వే షేర్లు స్పీడ్‌

20 May, 2020 10:14 IST|Sakshi

ఐఆర్‌సీటీసీ, రైల్‌ వికాస్‌ 5 శాతం అప్‌

జూన్‌ 1 నుంచీ పట్టాలెక్కనున్న 200 రైళ్లు

రెట్టింపుకానున్న శ్రామిక్‌ స్పెషల్స్‌- 440కు

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్‌ను ఈ నెలాఖరు వరకూ నాలుగోసారి పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడిలించింది. దీనిలో భాగంగా రైల్వే శాఖ శ్రామికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు నిర్వహిస్తున్న శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను రెట్టింపునకు పెంచుతున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ వారం నుంచీ 400 శ్రామిక్‌ స్పెషల్స్‌ నడవనున్నాయి. కాగా.. మరోవైపు సాధారణ ప్రయాణికుల కోసం మరో 200 నాన్‌ఏసీ రైళ్లను సైతం జూన్‌ 1 నుంచీ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయితే వీటికి రిజర్వేషన్‌ సౌకర్యం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే న్యూఢిల్లీ నుంచి దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ  ఈ 11 నుంచీ రైల్వే శాఖ 30 ఏసీ ట్రయిన్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండు నెలల లాక్‌డవున్‌ తదుపరి నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలు తదితరాలు ఊపందుకోనున్నట్లు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. 

లాభాల్లో..
ఎన్‌ఎస్‌ఈలో రైల్‌ రంగ కౌంటర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు అధికం కావడంతో ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 63.5 పెరిగి రూ. 1333ను అధిగమించింది. ఈ బాటలో రైల్‌ వికాస్‌ నిగమ్‌ సైతం 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు చేరింది. రూ. 17.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. ఇక టెక్స్‌మాకో రైల్‌ 2.6 శాతం ఎగసి రూ. 21.7 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు