ఆ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే

28 Jun, 2019 17:56 IST|Sakshi

కేంద్ర రైల్వే శాఖమంత్రి పియూష్‌ గోయల్‌ కీలక ప్రకటన

ఆర్పీఎఫ్ పోస్టుల భర్తీలో  50శాతం మహిళలకు

మొత్తం  9వేల  ఉద్యోగాల్లో 4500 మహిళలకే

సాక్షి,  న్యూఢిల్లీ:  కేంద్ర  రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌)లో ఖాళీ కానున్న  ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నామని శుక్రవారం ప్రకటించారు. ఆర్పీఎఫ్లో దాదాపు 9 వేల కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు త్వరలో ఖాళీ కానున్నాయని, ఇందులో 50 శాతం మహిళలకే కేటాయించ నున్నామంటూ  ఆయన ట్వీట్‌ చేశారు. అంటే  4500 ఉద్యోగాలు మహిళలు  దక్కించుకోనున్నారు. రైల్వేలో ఎక్కువమంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని  తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి వెల్లడించారు

రైల్వేలలో 1.32 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, మరో రెండేళ్లలో ఒక లక్ష మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారని ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే.  గత ఏడాది ప్రారంభించిన నాలుగు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ  రాబోయే రెండు నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.  రైల్వేలకు చెందిన మౌలిక సౌకర్యాలు, రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిరక్షణ బాధ్యతను ఆర్పీఎఫ్ చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో గవర్నమెంట్ రైల్వే (జీఆర్‌పీ)శాంతి భద్రతల అంశాలను చూసుకుంటుందని, గడచిన రెండేళ్లలో మహిళల భద్రత, చిన్న పిల్లలు తప్పిపోకుండా నివారించే చర్యలను విజయవంతంగా నిర్వర్తించామని గోయల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు