రైలు టికెట్‌ రద్దు: మీకో షాకింగ్‌ న్యూస్‌

26 Feb, 2020 09:12 IST|Sakshi

టికెట్‌ కాన్సిలేషన్‌ ద్వారా రైల్వేకు భారీ ఆదాయం

సాక్షి, న్యూఢిల్లీ: వెయిట్‌లిస్ట్ చేసిన టికెట్లను రద్దు చేయడం మర్చిపోయారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. భారతీయ రైల్వే కాన్సిలేషన్‌ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. రైల్వే ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు, లేదా రద్దు చేసుకోవడం మర్చిపోయిన టికెట్ల ద్వారా....అక్షరాల 9వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్‌ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ. 9 వేల కోట్ల ఆదాయం వచ్చిందని  స్వయంగా రైల్వే సమాచార సంస్థ కేంద్రం (సీఆర్‌ఐఎస్‌) వెల్లడించింది. రాజస్థాన్‌ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్‌ స్వామి సమాచార హక్కు చట్టం కింద  వివరాలను కోరడంతో సీఆర్‌ఐఎస్‌ ఈ వివరాలను వెల్లడించింది.

జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2020 మధ్య కాలంలో (మూడేళ్లు)  వెయిటింగ్‌ లిస్టులో ఉన్న 9.5 కోట్ల మంది తమ టికెట్లను రద్దు చేసుకోలేదు. తద్వారా ఈ ప్రయాణికుల నుండి అత్యధికంగా రూ .4,335 కోట్లు సంపాదించింది.  అలాగే టికెట్ల క్యాన్సిలేషన​ ద్వారా రూ.4335కోట్లను ఆర్జించింది. ఇలా గత మూడేళ్లలో టికెట్ రద్దు ఛార్జీలు, వెయిట్‌లిస్ట్ టికెట్లను రద్దు చేయకపోవడం వల్ల భారతీయ రైల్వే 9,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఆన్‌లైన్  ద్వారా ఐఆర్‌సిటిసి రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఖచ్చితమైన పెరుగుదల ఉందని  తెలిపింది. 2017- 2020 జనవరి 31 వరకు మొత్తం 145 కోట్ల మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోగా,  రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా పాత బుకింగ్ పద్ధతిలో 74 కోట్ల మంది టికెట్లను తీసుకున్నారు.

భారతీయ రైల్వేల రిజర్వేషన్‌ పాలసీ, రీఫండ్‌ పాలసీ (రద్దు  చేసుకున్న టికెట్లపై ప్రయాణికులకు తిరిగి వచ్చే సొమ్ము)లో  చాలా వివక్ష వుందని సుజిత్‌ స్వామి ఆరోపించారు. అలాగే ఆన్‌లైన్‌ బుకింగ్‌, కౌంటర్‌ బుకింగ్‌ల మధ్య చాలా వ్యత్యాసం వుందని, ఇది ప్రయాణికులపై అనవసరపు భారాన్ని మోపుతోందని వాదించారు. తద్వారా రైల్వే అన్యాయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోందంటూ స్వామి  రాజస్థాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా రైల్వే టిక్కెట్లను కాన్సిల్‌ చేసినపుడు, పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కోత పెట్టి, మిగతా సొమ్మును వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందన్న సంగతి తెలిసిందే. 

నిర్ణీత సమయానికి 48 గంటల లోపు టికెట్లను కాన్సిల్‌ చేసుకుంటే.. చార్జీలు
ఏసీ ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 240 + జీఎస్టీ 
ఏసీ 2 టైర్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ల రద్దు  ఛార్జీ రూ. 200 + జీఎస్టీ 
ఏసీ 3 టైర్ / ఏసీ చైర్ కార్ / ఏసీ 3 ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కోసం రద్దు ఛార్జీ రూ. 180 + జీఎస్టీ
స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం, రద్దు ఛార్జీ రూ. 120.
సెకండ్‌ క్లాస్‌  టిక్కెట్లపై రూ. 60

మరిన్ని వార్తలు