ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచే సమీకరణ
ముంబై: రైల్వే ప్రయాణానికి సంబంధించిన కన్సూమర్ యాప్ స్టార్టప్, రైల్యాత్రిడాట్ఇన్.. ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి తాజాగా నిధులు సమీకరించింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు-నందన్ నీలేకని, హిలియన్ వెంచర్స్, ఒమిడ్యార్ పార్ట్నర్స్, బ్లూమ్ వెంచర్స్ నుంచి తాజాగా పెట్టుబడులు సమీకరించామని రైల్యాత్రిడాట్ఇన్ తెలిపింది. అయితే ఎన్ని పెట్టుబడులు వచ్చింది వంటి ఆర్థిక వివరాలను ఈ సంస్థ వెల్లడించలేదు.
ఈ ఏడాది మార్చి తర్వాత ఇదే మరో దఫా పెట్టుబడుల సమీకరణ అని రైల్యాత్రిడాట్ఇన్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన మనీశ్ రాఠి తెలిపారు. ఈ యాప్... ప్రయాణికుడి మొబైల్ జీపీఎస్ను వినియోగించుకొని ఒక రైలు ఎంత ఆలస్యంగా వచ్చేది అంచనా వేస్తుంది. అంతేకాకుండా రైలు ఏ ప్లాట్ఫార్మ్ మీదకు వస్తుంది, కోచ్ పొజిషన్, ట్రైన్ ఆన్ టైమ్ హిస్టరీ, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్స్ వివరాలతో పాటు మంచి నాణ్యత గల భోజనం అందించే ఏర్పాట్లు, బస్ టికెట్లు, బడ్జెట్ రూమ్స్ బుకింగ్ తదితర సేవలనూ అందిస్తోంది.