ఈ–కామర్స్ సంస్థలకు నూతన నిబంధనలు: పాశ్వాన్
న్యూఢిల్లీ: ఏ దేశంలో ఉత్పత్తి తయారైందన్న సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేసే విధంగా (ఈ–కామర్స్ సంస్థలు/ఆన్లైన్ వేదికగా విక్రయించేవి) నూతన నిబంధనలు ఈ వారం చివరి నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. నిబంధనలు అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో నమోదైన అన్ని ఎల్రక్టానిక్ సంస్థలతోపాటు, విదేశాల నుంచి భారతీయ వినియోగదారులకు ఉత్పత్తులను ఆఫర్ చేసే సంస్థలకు కూడా ‘వినియోగదారు పరిరక్షణ నిబంధనలు, 2020’ వర్తిస్తాయని పాశ్వాన్ పేర్కొన్నారు.
వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద రూపొందించిన చాలా వరకు నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని, ఈ– కామర్స్ నిబంధనలను వారం చివర్లో నోటిఫై చేయనున్నామని ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా విక్రయించే దుకాణాలకు నిబంధనల అమలుకు సమయం పడుతుందన్నారు.