ఎస్‌ బ్యాంకు సీఎండీ రాణా కపూర్‌కు షాక్‌

19 Sep, 2018 20:33 IST|Sakshi
ఎస్‌ బ్యాంకు సీఎండీ రాణా కపూర్‌

సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్‌బ్యాంకు సీఎండీ రాణా కపూర్‌కు ఆర్‌బీఐ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక ఆదుశాలు జారీ చేసింది. ఎస్‌బ్యాంకు మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రాణా కపూర్‌ పదవీకాలం 2019 జనవరితో ముగుస్తుందని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. అంతేకాదు ఈ లోపు కొత్త సీఎండీని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఎస్‌బ్యాంకుకు సూచించింది. ఈ విషయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు యస్ బ్యాంక్ బోర్డు వచ్చే వారం సమావేశమవుతుంది.

ఆగస్టు 31తో రాణా కపూర్‌ పదవీకాలం ముగిసింది. అయితే ఎస్‌ బ్యాంకు ప్రకటించిన‍ట్టుగా మూడేళ్లపాటుకాకుండా ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి చివరి వరకు మాత్రమే బ్యాంకు సీఎండీగా కొనసాగుతారు. సెప్టెంబరు 17న ఆర్‌బీఐ రాసిన లేఖ ఈ రోజు తమకు చేరిందని ఎస్‌ బ్యాంకు ధృవీకరించింది. ఈ నేపథ్యంలో​ సెప్టెంబరు 25న బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశా నిర్వహించనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాణా కపూర్‌ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతి లభించినట్టు ఎస్‌ బ్యాంకు ఇటీవల(ఆగస్టు 30, 2018) ప్రకటించింది. తదుపరి నోటీస్‌ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్‌ను సీఈవో, ఎండీగా కొనసాగుతారని స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు ఈ ఏడాది జూన్‌లో ఎస్‌ బ్యాంక్‌ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్‌ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. ఈ నేపథ‍్యంలో  ఆర్‌బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రేపటి (గురువారం)మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఎలాంటి స్పందిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు