డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం ‌: ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

16 Jan, 2020 08:11 IST|Sakshi

సాక్షి, ముంబై: వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అక్రమాలకు చెక్‌ పెట్టడంతోపాటు  డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లో పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలను దృష్టిలో వుంచుకున్న ఆర్‌బీఐ ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది. క్రెడిట్, డెబిట్ కార్డులను  ఏటీఎం, పోస్ పరికరాలతో మాత్రమే ఉపయోగించుకునే అవకాశం వుంటుందని ఆర్‌బీఐ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లో  వెల్లడించింది. అలాగే ఈ కార్డులను (అంతర్జాతీయమా, దేశీయమా) వినియోగాన్ని నియంత్రించుకునే అధికారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2020, మార్చి16 నుండి అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం​ భారతదేశంలో ఏటీఎం,  పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) లాంటి కాంటాక్ట్-బేస్డ్ యూజ్ పాయింట్ల వద్ద మాత్రమే అన్ని కార్డులు ఉపయోగించవచ్చు. అయితే ఏ వ్యక్తి అయినా ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే, ఈ సేవలకు వారి కార్డు నిలిపివేస్తారు. తిరిగి ఈ సేవలను పొందటానికి వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న కార్డ్ వినియోగదారుల కోసం దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కార్డును నిలిపివేయాలా వద్దా అనే విషయాన్ని బ్యాంకులు నిర్ధారించుకోవాల్సి వుంటుంది. అలాగే ఆన్‌లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని కార్డులపై ఈ సేవలను తప్పనిసరిగా (మాండేటరీ) నిలిపివేయబడతాయని స్పష్టం చేసింది. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్ హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్బీఐ సూచించింది.

అయితే ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, స్మార్ట్ కార్డులకు, ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రో, బెంగళూరు మెట్రో లాంటి జాతీయ రవాణాలో ఉపయోగించే కార్డులకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదని ఆర్‌బీఐ వివరించింది.  అన్ని ఏటీఎంలు, పీఓఎస్‌ డివైస్‌లలో ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు