పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అనిశ్చితి

22 Dec, 2016 01:52 IST|Sakshi
పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అనిశ్చితి

ఆర్‌బీఐ ఎంపీసీ అభిప్రాయం
ముంబై:  పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ద్రవ్యోల్బణ లక్ష్యంపై దృష్టి కారణంగానే కీలక రేట్లను యధాతథంగా కొనసాగించడానికే ఆర్‌బీఐ గవర్నర్‌  ఊర్జిత్‌ పటేల్‌ మొగ్గు చూపారు. పెద్ద  కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు వుండొచ్చనే అంశంపై అనిశ్చితి నెలకొందని పటేల్‌ అభిప్రాయపడ్డారు. ఈ నెల 6–7 మధ్య జరిగిన ఆర్‌బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకా రం... ఈ కమిటీలోని ఆరుగురు సభ్యులు రెపో రేటు ను 6.25 శాతంగా ఉంచడానికే మొగ్గు చూపారు.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతం రేంజ్‌లోనే నియంత్రించాలనే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాలని పటేల్‌ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, స్వల్ప కాలిక ప్రభా వం ఉంటుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌. గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే మధ్య కాలానికి వృద్ధి అవకాశాలపై చెప్పుకోదగ్గ ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. చమురు ధరలు, భౌగోళిక–రాజకీయ స్థితిగతుల ప్రభావం ఉంటుందని వివరించారు.

పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్‌ అని మరో సభ్యుడు రవీంద్ర హెచ్‌ డోలాకియా అభిప్రాయపడ్డారు. ఫలితంగా జీడీపీ అంచనాల ను తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని వివరించారు.

పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను తట్టుకునే స్థాయిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉందని మరో ఎంపీసీ సభ్యురాలు పామి దువా అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని ఆమె పేర్కొన్నారు.

డిమాండ్‌ తగ్గుతుండడం, దేశీయంగా సరఫరా సంబంధిత సమస్యలు తాత్కాలికమేనని మరో ఎంపీసీ సభ్యుడు దేబబ్రత పాత్ర అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినరిస్క్‌లు, ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు