ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలోకి రూ.12,000 కోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ‘‘లిక్విడిటీ పరిస్థితులను అంచనా వేసిన అనంతరం నవంబర్ 15న రూ.12,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద కొనుగోలు చేయాలని నిర్ణయించాం’’ అని ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది.
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం అనంతరం మార్కెట్లో ఏర్పడిన ద్రవ్య లభ్యత ఇబ్బందులను తాజా ఆర్బీఐ నిర్ణయం తేలిక పరచగలదని అంచనా. ఆసక్తి కలిగిన వారు ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ–కుబర్) వ్యవస్థ ద్వారా తమ ఆఫర్లను సమర్పించొచ్చని కేంద్ర బ్యాంకు తన ప్రకటనలో సూచించింది.