పేమెంట్‌ వ్యవస్థలకు ప్రత్యేక నియంత్రణ అక్కర్లేదు: ఆర్‌బీఐ

20 Oct, 2018 01:23 IST|Sakshi

ముంబై: పేమెంట్, సెటిల్‌మెంట్‌ చట్టంలో మార్పులకు ప్రభుత్వ ప్యానెల్‌ చేసిన సిఫారసులతో ఆర్‌బీఐ తీవ్రంగా విభేదించింది. పేమెంట్‌ వ్యవస్థల నియంత్రణ కచ్చితంగా ఆర్‌బీఐ పరిధిలోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఓ అంతర్గత మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టం(పీఎస్‌ఎస్‌), 2007కు చేయాల్సిన సిఫారసులతో ఈ కమిటీ ఓ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది.

పేమెంట్‌ సంబంధిత అంశాలను పర్యవేక్షించేందుకు ఓ స్వంతంత్ర నియంత్రణ సంస్థ ఉండాలని సూచించింది. ‘‘ఆర్‌బీఐకి బయట పేమెంట్‌ వ్యవస్థల కోసం నియంత్రణ సంస్థ ఉండాల్సిన అవసరమే లేదు’’ అని సంబంధిత ప్రభుత్వ కమిటీకి ఆర్‌బీఐ తన అసమ్మతి నోట్‌ను సమర్పించింది. అయితే, నూతన పీఎస్‌ఎస్‌ బిల్లుకు ఆర్‌బీఐ పూర్తిగా వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ‘‘మార్పులన్నవి ప్రస్తుత వ్యవస్థలను కుదిపివేసే మాదిరిగా ఉండకూడదు. అంతర్జాతీయంగా ప్రశం సలు పొంది, చక్కగా కొనసాగుతున్న మన దేశ వ్యవస్థల సామర్థ్యానికి సమస్యలు సృష్టించేలా ఉండకూడదు’’ అని ఆర్‌బీఐ తన నోట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు