దేశంలో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే చాన్స్‌!

17 Aug, 2019 12:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ అంచనా వేస్తోంది. 2020 మార్చి ముగిసే నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రెపో రేటును మరో 0.40 శాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇప్పటివరకూ ఆర్‌బీఐ తీసుకున్న పరపతి విధాన సరళీకరణ చర్యలు ఆర్థికవృద్ధికి తగిన విధంగా దోహదపడలేదని విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. గడచిన వరుస నాలుగు ద్వైమాసిక సమీక్షల కాలంలో ఈ రేటును ఆర్‌బీఐ 1.1% తగ్గించింది. దీనితో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. అయితే రెపో తగ్గింపు ప్రయోజనం పూర్తిగా కస్టమర్లకు బదలీకాలేదు. 

లోధా డెవలపర్స్‌ రేటింగ్‌ తగ్గింపు
రియల్టీ  కంపెనీ మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (మునుపటి పేరు లోధా డెవలపర్స్‌) ద్రవ్య నిర్వహణ అంశంపై తాజాగా ఫిచ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్లు, 2021 ఏడాదిలో రూ.5,000 కోట్ల అప్పులను సంస్థ చెల్లించాల్సి ఉండగా.. వీటి చెల్లింపులపరంగా సవాళ్లను ఏదుర్కోనుందని తాజాగా ‘ఫిచ్‌ రేటింగ్స్‌’ తన అంచనాను ప్రకటించింది.  చెల్లింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘బీ మైనస్‌’ రేటింగ్‌ ఇచ్చింది. వీటిని తిరిగి చెల్లించలేని పక్షంలో ప్రస్తుతం జంక్‌ రేటింగ్‌ మరింత కిందకు పడిపోవచ్చనీ పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు