డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రక్రియ వేగవంతం

23 Nov, 2019 03:47 IST|Sakshi

అడ్వైజరీ కమిటీని నియమించిన ఆర్‌బీఐ

ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియను రిజర్వ్‌ బ్యాంక్‌ వేగవంతం చేసింది. ఈ విషయంలో అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు, సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రాజీవ్‌ లాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో ఎన్‌ఎస్‌ కణ్ణన్, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ సభ్యులుగా ఉన్నారు.

అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ సుబ్రమణియకుమార్‌కు ఈ కమిటీ తగు విధంగా తోడ్పాటు అందిస్తుందని ఆర్‌బీఐ వెల్లడించింది. బ్యాంకులకు సుమారు రూ. 83,873 కోట్ల మేర బాకీ పడిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ .. దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న తొలి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌/హౌసింగ్‌ సంస్థ. దివాలా స్మృతికి సంబంధించి ఇటీవల నోటిఫై చేసిన సెక్షన్‌ 227 ప్రకారం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డును ఆర్‌బీఐ తన అజమాయిషీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు