బ్యాంకుల ‘వడ్డింపు’ ప్రారంభం

8 Jun, 2018 00:46 IST|Sakshi

ఆర్‌బీఐ రేటు పెంపు నేపథ్యం..

ఆటో, గృహ, వ్యాపార రుణాలపై ‘ఈఎంఐ’ల భారం  

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం పెంచడం (6.25 శాతానికి)తో, వాణిజ్య బ్యాంకులు తక్షణం ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయించడం ప్రారంభించాయి. దీంతో ఆటో, గృహ, వ్యాపార రుణాలకు సంబంధించి కస్టమర్లపై ఈఎంఐ భారం ప్రారంభమయినట్లయ్యింది. ఇందుకు సంబంధించిన పరిణామాలను గమనిస్తే... 

నాలుగున్నరేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆర్‌బీఐ రెపో రేటును బుధవారం పావుశాతం పెంచిన విషయం విదితమే. రేటు పెంపును ముందే అంచనావేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగంలో అతిపెద్ద రెండు బ్యాంకులు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సహా పలు బ్యాంకులు తమ మార్జినల్‌ కాస్ట్‌ (నిధుల సమీకరణకు సంబంధించి వ్యయాలు) ఆధారిత రుణ రేటును అప్పటికే కొంత పెంచేశాయి.  
ఈ పెద్ద బ్యాంకులకు తాజాగా ఇండియన్‌ బ్యాంక్, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లు తోడయ్యాయి. వివిధ మెచ్యూరిటీలపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలిపాయి.  
ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ మూడు నెలల నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించిన రుణ రేటును 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ కూడా 6 నెలలు, ఏడాది కాల వ్యవధి రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది.  
త్వరలో రుణరేటు పెంపు దిశలో  నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పేర్కొంది. 
కాగా తక్షణం బ్యాంకింగ్‌ వడ్డీరేట్ల పెంపు భారీగా ఏమీ ఉండకపోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎఫ్‌ఏఎల్‌ఎల్‌సీఆర్‌ (ఫెసిలిటీ టూ అవీల్‌ లిక్విడిటీ ఫర్‌ లిక్విడిటీ కవరేజ్‌ రేషియో)లో పెంపు వల్ల బ్యాంకుల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండడమే దీనికి కారణమన్నారు.  

మరిన్ని వార్తలు