కర్ణాటక బ్యాంక్‌కు భారీ జరిమానా

4 Mar, 2019 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రయివేటురంగ బ్యాంకు కర్ణాటక బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్‌బీఐ  4 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌పంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌  సేవలకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌ స్విఫ్ట్ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్ ‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలీ కమ్యూనికేషన్‌) సంబంధిత కార్యాచరణ నియంత్రణ లోపం కారణంగా ముఖ్యంగా, నాలుగు నిబంధనల అమలులో ఆలస్యం జరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది.   

దీంతోపాటు మరో నాలుగు బ్యాంకులు( ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఐడిబిఐ)కు నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నగదు జరిమానా విధించింది. యూనియన్ బ్యాంక్, దేనా బ్యాంకుకు రూ. 2కోట్లు, ఐడీబీఐ, ఎస్‌బీఐలకు  తలా ఒక కోటి రూపాయలు చొప్పున జరిమానా విధించింది.   శనివారం  రెగ్యులేటరీకి అందించిన సమాచారంలో ఆయా బ్యాంకులు  వెల్లడించాయి. 

కాగా స్విఫ్ట్‌ లావాదేవీల అక్రమాల కారణంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులో రూ.14వేల కోట్ల స్కాం సంభవించిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన ఈ స్కాంలో పీఎన్‌బీలోవజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ  అక్రమాలు గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అన్ని రకాల లావాదేవీలపై నిబంధనలను కఠినతరం చేసింది.  

మరిన్ని వార్తలు