5.6 కోట్ల చ.అ.లకు చేరిన ఆఫీసు స్థలం!

17 Feb, 2018 02:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  దేశీయ రియల్టీ రంగంలో హైదరాబాద్‌ కీలకంగా మారింది. నివాస సముదాయాల్లోనే కాదు వాణిజ్య, ఆఫీసు విభాగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతోందని ప్రముఖ రియల్టీ కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ధ కాలంలో హైదరాబాద్‌ ఆఫీసు స్టాక్‌ రెండితలు వృద్ధితో 5.6 కోట్ల చ.అ.కు చేరిందని నివేదిక పేర్కొంది. మరిన్ని వివరాలివే..

రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి మెరుగైన మౌలిక వస తులు, నాణ్యమైన విద్యా సం స్థలు, ప్రోత్సాహకరమైన ప్రభుత్వ విధానాలు, టెక్నా లజీ హబ్, నైపుణ్యమున్న యువత వంటివి హైదరాబాద్‌ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయని నివేదిక పేర్కొంది.
 ప్రస్తుతం హైదరాబాద్‌లో సంఘటిత రిటైల్‌ స్టాక్‌ 29 లక్షల చ.అ.కు చేరింది. పశ్చిమ, సెంట్రల్‌ హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌ వంటి హైస్ట్రీట్‌ ప్రాంతాల్లో పరిమిత సప్లయి కారణంగా అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. 2011–2017 నాటికి అద్దెలు ఏటా 4 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. సమీప భవిష్యత్తులో మరో 3.7 మిలియన్‌ చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా.
    2017లో నగరంలో 68 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లీజుకుపోయింది. ఏడాది కాలంలో నగరంలో ఆఫీసు డిమాండ్‌ 102 శాతం, రిటైల్‌ 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది నగరంలో 12.3 లక్షల చ.అ. లాజిస్టిక్‌ స్థలం లీజుకుపోయింది. ఈ విభాగం ఏడాదిలో 93 శాతం వృద్ధిని నమోదు చేసింది.  
 అందుబాటు గృహాలతో పాటూ, ప్రీమియం నివాస సముదాయలకూ నగరంలో డిమాండ్‌ ఉంది. పశ్చిమ ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, గచ్చిబౌలిలకు పోటీగా తూర్పు ప్రాంతాలైన ఎల్బీనగర్, నాచారాం, మలక్‌పేట ప్రాంతాలు వృద్ధి చెందుతున్నాయి.


హైదరాబాద్‌ హాట్‌స్పాట్‌
దేశంలోని రియల్టీ రంగంలో హైదరాబాద్‌ హాట్‌స్పాట్‌గా మారింది. స్థానిక పెట్టుబడిదారులతో పాటూ బహుళ జాతి కంపెనీల ఇన్వెస్టర్లూ నగరం వైపు దృష్టిసారించారు. ప్రధానంగా కొత్త నివాస ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మణికొండ, కూకట్‌పల్లి, నానక్‌రాంగూడ, కొండాపూర్‌ వంటి ప్రాంతాలోని ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్నారు. ప్రధాన నగరంలో ప్రీమియం/లగ్జరీ ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు పరిమితంగా ఉన్నాయి.     – అన్షుమన్‌ మ్యాగజైన్,సీబీఆర్‌ ఇండియా చైర్మన్‌     

మరిన్ని వార్తలు