షియోమీ సంచలన ఆఫర్.. ప్చ్!

17 Oct, 2016 16:10 IST|Sakshi
షియోమీ సంచలన ఆఫర్.. ప్చ్!

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ప్రకటించిన రూపాయి సేల్ వినియోగదారులను ఉసూరు మనిపించింది. రూపాయికే స్మార్ట్ ఫోన్ దక్కించుకోవాలని ప్రయత్నించిన యూజర్లుకు నిరాశే ఎదురైంది. దీపావళి అమ్మకాల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయిస్తామని షియోమీ ప్రకటించడంతో కోట్లాది మంది ఎంఐ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఫ్లాష్ అమ్మకాల కోసం ముందుగానే ఎంఐ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి వేచి చూశారు. ఫ్లాష్ అమ్మకాలు మొదలయి సెకన్ సమయం అయినా గడవకుండానే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్ముపోయాయన్న సందేశం చూసి వినియోగదారులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కేవలం 30 ఫోన్లు మాత్రమే రూపాయికి విక్రయిస్తామని షియోమీ ముందుగానే ప్రకటించింది. ఫోన్లు తక్కువ, పోటీ ఎక్కువ కారణంగానే అతి తక్కువ సమయంలో అమ్మకాలు పూర్తయినట్టు భావిస్తున్నారు. దీపావళి అమ్మకాలకు ప్రచారం కోసమే షియోమీ రూపాయి ఆఫర్ ప్రకటించిందని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అయితే షియోమీ ప్రకటించినట్టుగా 30 మందికైనా ఫోన్లు దక్కాయో, లేదో చూడాలి.

కాగా, రెడ్ మీ 3ఎస్(రూ.6,499) , రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ( రూ.8,499) స్మార్ట్ ఫోన్లను ఈ రోజు లాంచ్ చేసిన వెంటనే ఈరోజుకు అమ్మకాలు పూర్తయినట్టు ఎంఐ వెబ్ సైట్ లో కనబడింది. ఈ రెండు ఫోన్లను దక్కించుకునేందుకు రేపు, ఎల్లుండి కూడా అవకాశముంది.

>
మరిన్ని వార్తలు