రిలయన్స్‌, బీపీ కీలక ఒప్పందం

6 Aug, 2019 20:46 IST|Sakshi
ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డాడ్లీ ఫైల్‌ ఫోటో

రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోలు బంకులు

సాక్షి, న్యూఢిల్లీ:  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తన బ్రిటిష్‌ భాగస్వామి బీపీ పీఎల్‌సీతో  కలిసి కొత్త జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు  చేసింది.  తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.  వీటితోపాటు ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను భారత్‌లోని విమానయాన సంస్థలకు విక్రయించాలని ప్రణాళికలు రచించాయి.  ఈ మేరకు ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డాడ్లీ  ఒప్పంద పత్రాలపై మంగళవారం ముంబైలో సంతకాలు చేశారు.  తుది ఒప్పందం 2019, రెగ్యులేటరీ, ఇతన అనుమతులకు నిబంధనలకు లోబడి, లావాదేవీ 2020 మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని భావిస్తున్నామిన ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. రీటైల్‌ వ్యాపారాన్ని ఇప్పటికే ఉన్న రిలయన్స్‌ బంకుల ఆధారంగా నిర్మించనున్నారు. 

సరికొత్త జాయింట్‌  వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నామనీ,  రీటైల్‌ సర్వీస్‌ స్టేషన్‌ నెట్‌వర్క్‌ద్వారా , వైమానిక ఇంధన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి.  కొత్త జాయింట్ వెంచర్ కంపెనీలో ఆర్‌ఐఎల్ 51శాతం వాటాను, బిపి 49శాతం వాటాను  వాటాను కలిగి  ఉంటాయి. ఈ ఉమ్మడి సంస‍్థ ఆధర్యంలో 5,500 ఇంధన రిటైల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్‌లో ఆర్‌ఐఎల్‌ ఏవియేషన్ ఇంధనాల వ్యాపారం కూడా ఉంటుంది,  ఈ జాయింట్‌ వెంచర్‌ ద్వారా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలని  ఆర్‌ఐఎల్‌ యోచిస్తోంది.

దేశంలో గ్యాస్‌  వనరులను అభివృద్ధి చేయడంలో తమ బలమైన భాగస్వామ్యం ఇప్పుడు ఇంధన రిటైలింగ్, విమాన ఇంధనాలకు కూడా విస్తరిస్తామని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.  వినియోగదారులకు దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి సేవలను మరింత పెంచడంలో తమ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందన్నారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా అవతరించనుందని బాబ్ డాడ్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పెద్ద పెట్టుబడిదారుగా ఉన్న తాము ఈ వృద్ధికి తోడ్పడేందుకు మరింత ఆకర్షణీయమైన, వ్యూహాత్మక అవకాశాలవైపు చూస్తున్నామన్నారు.  

కాగా  ఆర్‌ఐఎల్ ఇప్పటికే దేశంలో 1300 ఇంధన రిటైల్ పంపులను స్వతంత్రంగా నడుపుతుండగా, బీపీకి అక్టోబర్ 2016 లో భారతదేశంలో 3,500 ఇంధన రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ లభించింది.  భారతదేశంలో 5 వేల పెట్రోల్ పంపులను తెరవడానికి ఆర్‌ఐఎల్‌కు లైసెన్సులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు