బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి ఆర్‌కామ్‌ టవర్ల వ్యాపారం

22 Dec, 2016 01:08 IST|Sakshi
బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి ఆర్‌కామ్‌ టవర్ల వ్యాపారం

డీల్‌ విలువ రూ.11,000 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ తన టవర్ల వ్యాపారంలో 51 శాతం వాటాను  కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి విక్రయించనున్నది. అంతా నగదు చెల్లింపులతో కూడిన ఈ డీల్‌ విలువరూ.11,000 కోట్లు. భారత మౌలిక రంగంలో  అతి పెద్ద విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ డీల్‌ ఇదేనని ఆర్‌కామ్‌ తెలిపింది.  తమ టవర్ల వ్యాపారం, ఆర్‌కామ్‌ ఇన్‌ఫ్రాటెల్‌లో 51% వాటాను విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీతో డీల్‌కుదుర్చుకున్నామని పేర్కొంది. ఈ డీల్‌ ద్వారా లభించే నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపింది.

టవర్ల వ్యాపారాన్ని ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేస్తామని, దీని యాజమాన్యం,నిర్వహణ మొత్తం బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే ఉంటుందని వివరించింది. ఈ కంపెనీకి ఆర్‌కామ్, రిలయన్స్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోలు క్లయింట్లుగా ఉంటాయి.  ఎయిర్‌సెల్‌ వైర్లెస్‌ వ్యాపార విలీనం,టవర్ల వ్యాపార విక్రయం కారణంగా తమ రుణ భారం రూ.31,000 కోట్లు(దాదాపు 70%) తగ్గుతుందని ఆర్‌కామ్‌ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఆర్‌కామ్‌ రుణభారం రూ.42,000 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో ఆర్‌కామ్‌ షేర్‌ 7% లాభపడి రూ.37.45కు చేరింది.

మరిన్ని వార్తలు