రిలయన్స్‌ @రూ.8 లక్షల కోట్లు

24 Aug, 2018 01:11 IST|Sakshi

అత్యధిక మార్కెట్‌ విలువగల  భారత కంపెనీ ఇదే... 

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి షేర్‌  

ముంబై: ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అరుదైన రికార్డ్‌ను సాధించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ గల కంపెనీగా రికార్డ్‌ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా నిలిచింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,274ను తాకిన ఈ షేర్‌ చివరకు  1.8% లాభంతో రూ.1,270 వద్ద ముగిసింది. ఈ షేర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గురువారం ఒక్క రోజే రూ.15,527 కోట్లు పెరిగింది. దీంతో ఈ  కంపెనీ మార్కెట్‌ రూ.8,04,691 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్‌ 37 శాతం వరకూ లాభపడింది.  

ఏజీఎమ్‌ నుంచి జోరు...: గతనెలలో జరిగిన ఏజీఎమ్‌లో ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్‌ జియో గిగా ఫైబర్‌(ఫైబర్‌–టు–ద హోమ్‌ సర్వీస్‌)ను ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్‌ జోరుగా పెరుగుతోంది. ఈ షేర్‌ గత నెల 12న 10, 000 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా అవతరించింది. 2007లో ఈ ఘనత సాధించిన ఈ కంపెనీ మళ్లీ అదే ట్యాగ్‌ను ఈ ఏడాది పొందింది. గత నెల 13న ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌రూ.7 లక్షల కోట్లను అధిగమించింది. నెలన్నర రోజుల్లోనే మరో లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను జత చేసుకొని 8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా గురువారం అవతరించింది.
 

మరిన్ని వార్తలు