జియోతో రిలయన్స్‌లో జోష్‌

14 Oct, 2017 00:24 IST|Sakshi


సాక్షి,ముంబయి: రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండవ క్వార్టర్‌లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 12.5 శాతం వృద్ధితో రూ 8109 కోట్లకు పెరిగింది. కంపెనీ రాబడి 23.9 శాతం పెరిగి రూ 1,01,169 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్‌లో రిలయన్స్‌ రిటైల్ జెనెసిస్‌ లగ్జరీ లిమిటెడ్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో ఆర్‌ఐఎల్‌ బాలాజీ టెలిఫిల్మ్స్‌లో వాటా కొనుగోలు చేసింది.

ఆర్థిక ఫలితాలపై ఆర్‌ఐఎల్‌ సీఎండీ ముఖేష్‌ అంబానీ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిందన్నారు. ఈ క్వార్టర్‌లో కంపెనీ అద్భుత సామర్ధ్యం కనబరిచిందని, రిలయన్స్‌ జియో తన తొలి క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని అన్నారు. తమ రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపార వృద్ధి కంపెనీ ఫలితాలపై సానుకూల ప్రభావం చూపిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపార అవకాశాల విస్తృతి ఫలితాలు ఇవ్వడం మొదలైందని అన్నారు. రిటైల్‌ బిజినెస్‌ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. డిజిటల్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ జియో నూతన తరం డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటుందని అన్నారు. 4జీ టెక్నాలజీలో భారీగా వెచ్చించడంతో పాటు సరైన వ్యాపార వ్యూహాలతో జియో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలిగిందని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు