2020 నాటికి జియో మరో సంచలనం

21 Jun, 2019 11:54 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ  టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఐపీవోకి రానుందన్న ఊహాగానాలు  మార‍్కెట్‌ వర్గాల్లో  మరోసారి వ్యాపించాయి.  ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌జియో ఇన్ఫోకామ్‌ మరో సంచలనానికి రడీ అవుతోంది. వచ్చే ఏడాదికల్లా ఐపీవోకు రావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దఫాలుగా వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. 

ఎకనామిక్ టైమ్స్ నివేదిక  ప్రకారం  2020 ఏడాది అర్థభాగం నాటికి జియోను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోంది.  దీనికోసం బ్యాంక్లు,  కన్సల్టెంట్లతో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పలు సమావేశాలు నిర్వహించారని పేర్కొంది.  దీంతో ఐపీవో ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని తెలిపింది. ప్రస్తుత 4జి నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, 5జి స్పెక్ట్రమ్‌ కొనుగోలు అలాగే తన మౌలిక సదుపాయాలను తదుపరి తరం ఇంటర్నెట్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయడం కూడా  పెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించింది.

వినియోగదారులపరంగా, సేవలపరంగా టాప్‌ బ్రాండ్‌గా నిలిచిన రిలయన్స్ జియో మార్చి త్రైమాసికంలో లాభాలను నివేదించిన ఏకైక టెల్కో.  2019 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో 840 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని నమోదు చేసింది. నికర లాభం 64.7 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 510 కోట్ల రూపాయలు నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ .2,964 కోట్లు అని రిలయన్స్ జియో తెలిపింది. గత సంవత్సరం పోలిస్తే ఆదాయం 65శాతం పెరిగింది. 

కాగా జియో ఐపీవో వార్తలు గతంలో కూడా మార్కెట్‌ వర్గాల్లో హల్‌ చల్‌ చేశాయి. అయతే ఈ  వార్తలను జియో కొట్టిపారేసింది. తాజా అంచనాలపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి వుంది.

మరిన్ని వార్తలు