మరో మెగా డీల్ : అంబానీ కల నెలవేరినట్టే!

3 Jun, 2020 15:24 IST|Sakshi

సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం  రిలయన్స్ ఇండస్ట్రీస్  (ఆర్ఐఎల్)కు చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబికి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్‌మెంట్‌  సంస్థ  బిలియన్ (100 కోట్ల )డాలర్ల  మెగా డీల్ కు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే  రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారంలోనే అధికారికంగా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం వుందని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.  (గ్లోబల్ టెక్ సంస్థతో జియో మరో మెగా డీల్!)

అంతేకాదు  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఐ)  చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో(పీఐఎఫ్) కూడా చురుగ్గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇవి ఎంత పెట్టుబడి పెడుతుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, రెండు సంస్థలు 2 బిలియన్ డాలర్లకు (రూ .15 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. బహుశా జియో ప్లాట్‌ఫామ్‌లలో వాటా అమ్మకాలకు సంబంధించి ఇదే  చివరికి కావచ్చని కూడా భావిస్తున్నాయి. పీఐఎఫ్ అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలవనుందని అంచనా.  (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు)

జియో ప్లాట్‌ఫామ్‌ల వాటా అమ్మకాల ద్వారా రూ .85,000 - రూ .90,000 కోట్లు సేకరించాలని ఆర్‌ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు  వ్యూహాత్మక పెట్టుబడిదారుల ద్వారా కంపెనీ  రూ. 78,562 కోట్లు (10 బిలియన్ డాలర్లకు పైగా)  సాధించింది. దీంతో అంబానీ కల సాకారం ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. (జియోలో కేకేఆర్‌ భారీ పెట్టుబడి)

కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.  ఫేస్‌బుక్‌ ఏప్రిల్‌ 22న రూ. 43,574 కోట్లతో 9.99 శాతం వాటాలు కొనుగోలు మొదలు వరుసగా మెగా డీల్స్ ను ప్రకటిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్‌ లేక్‌,  విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్ లాంటి దిగ్గజ  సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులకు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. దీంతోపాటు టెక్ దిగ్గజం  మైక్రోసాఫ్ట్ తో  రెండు  బిలియన్ డాలర్ల  మరో భారీ ఒప్పందం  చేసుకోనుందని ఇటీవల పలు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి వుంది. 

మరిన్ని వార్తలు