జియోఫోన్‌ సేల్స్‌ మళ్లీ ప్రారంభం

28 Nov, 2017 10:52 IST|Sakshi

ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రిలయన్స్‌జియో ఫీచర్‌ ఫోన్‌ విక్రయాలను పునఃప్రారంభమయ్యాయి. ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు ప్రకారం ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ను ఈ టెలికాం కంపెనీ కస్టమర్లకు పంపడం ప్రారంభించిందని తెలిసింది. ఎవరైతే ముందస్తుగా జియో ఫోన్‌ ఆసక్తిని నమోదుచేసుకున్నారో వారికి ఈ వివరాలను రిలయన్స్‌జియో అందిస్తోంది. ఈ లింక్‌ ఓ కోడ్‌ను కలిగి ఉంటుంది. దాన్ని దగ్గర్లోని జియో అవుట్‌లెట్‌లో చూపించి, జియో ఫోన్‌ను పొందవచ్చని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు నివేదించింది. తొలి దశ అమ్మకాల్లో భాగంగా రిలయన్స్‌ జియో 60 లక్షల జియో ఫోన్లను విక్రయించింది. రెండో దశలో 10 మిలియన్‌ కస్టమర్లను చేరుకోవాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఈ ఫోన్‌ను ఈ ఏడాది జూలైలో ప్రారంభించారు. ఆగస్టులో కంపెనీ ప్రీ-ఆర్డర్లను ప్రారంభమించింది. ప్రీ-ఆర్డర్ల సమయంలోనే ఈ ఫోన్‌కు ఊహించనంత డిమాండ్‌ వచ్చింది. తొలుత రూ.1500 చెల్లించి జియో ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్‌ చేయనుంది. వాయిస్‌ అసిస్టెంట్‌ లాంటి స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు జియోఫోన్‌ ఆఫర్‌ చేస్తుంది. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, సింగిల్‌ సిమ్‌ ఫోన్‌, మైక్రోఎస్డీ కార్డు స్లాటు, ఎఫ్‌ఎం రేడియో, 2ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 0.3ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 512ఎంబీ ర్యామ్‌ ఆన్‌బోర్డు, 4జీబీ స్టోరేజ్‌, 128జీబీ విస్తరణ మెమరీ, 2000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రత్యేకతలు. 

మరిన్ని వార్తలు