మూడింతలు జంప్ చేసిన రిలయన్స్ పవర్

14 Apr, 2017 13:54 IST|Sakshi
మూడింతలు జంప్ చేసిన రిలయన్స్ పవర్
అనిల్ అంబానీ ప్రమోటెడ్ రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఒక్కసారిగా మూడింతలు జంప్ చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభాలు మూడింతలు పెరిగి రూ.216 కోట్లగా నమోదయ్యాయి. పన్ను వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ భారీ లాభాల్లోకి  ఎగిసింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభాలు రూ.61.55 కోట్లగా ఉన్నాయి. మొత్తంగా కంపెనీ ఆదాయాలు రూ.2548.94 కోట్ల నుంచి 6 శాతం పెరిగి రూ.2696.50 కోట్లగా నమోదైనట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ వ్యయాలు 3 శాతం పడిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2372.12 కోట్లగా ఉన్న కంపెనీ వ్యయాలు ఈ ఏడాది రూ.2311.1 కోట్లగా రికార్డయ్యాయి.
 
తక్కువ ఇంధనపు వ్యయం, ఫైనాన్స్ ధరలు తగ్గడంతో ఈ త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు కూడా దిగొచ్చినట్టు రిలయన్స్ పవర్ పేర్కొంది. వడ్డీలు, పన్నులు, తరుగుదల, రుణ విమోచన తర్వాత కంపెనీ ఆర్జించిన రాబడులు మార్చి క్వార్టర్లో రూ.1066 కోట్లగా ఉన్నాయి. దీంతో మొత్తంగా 2016-17 ఆర్థికసంవత్సరంలో కంపెనీ నికర లాభాలు 23 శాతం పెరిగి రూ.1,104 కోట్లగా నమోదైనట్టు, ఎబీఐటీడీఏలు రూ.4506 కోట్లగా రికార్డైనట్టు రిలయన్స్ పవర్ వెల్లడించింది.  
 
మరిన్ని వార్తలు