రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త రికార్డు

6 Jul, 2020 11:26 IST|Sakshi

ఉత్సాహానిస్తున్న వరుస పెట్టుబడులు 

రూ.1833 వద్ద కొత్తజీవితకాల గరిష్టస్థాయి

రూ.11.50లక్షల కోట్లకు మార్కెట్‌ క్యాప్‌  

దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ జియోలోకి వరుసగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్‌ షేరుకు డిమాండ్‌ పెరిగింది. నేటి ఉదయం బీఎస్‌ఈలో రూ.1801 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఈ షేరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒక దశలో 2.55శాతం పెరిగి రూ.1833.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర(రూ.1833.10) షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారి రూ.11.5లక్షల కోట్ల మార్కును దాటింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ రికార్డుకెక్కింది.

ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.1787.50)తో పోలిస్తే రూ.1828.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది షేరు కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1833.10లు, రూ.1833.10గా నమోదయ్యాయి. 

జియోలోకి 12వ పెట్టుబడి: 
రిలయన్స్‌ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. గ్లోబల్‌ సెమీకండక్టర్‌ దిగ్గజం ఇంటెల్‌ కార్ప్‌ 0.39శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్‌, టెలికం విభాగమైన రిలయన్స్‌ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు