సాక్షి, ముంబై: మహిళల సాధికారతకు సంబంధించి టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. భారతదేశ శ్రామిక శక్తిలోకి ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవటానికి కొన్ని టాగ్స్ను తొలగించాల్సిన అవసరం ఉందని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. పలానా ఉద్యోగాలు పురుషులకు మాత్రమే.. మహిళలు ఇది చేయలేరు, అది చేయలేరు, ఇలాంటివే చేయాలి లాంటి టాగ్స్ చాలా వున్నాయి. మహిళల అభివృద్ధికి అవరోధంగా ఉన్న ఇలాంటివాటిని ఇకనైనా తొలగించుకోవాలి. ఎక్కువమంది మహిళలను ఆయా రంగాల్లో ప్రోత్సాహించాల్సిన అవసరం వుందని మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో దేశంలోనే అతి పెద్ద సంస్థగా రికార్డు సొంతం చేసుకున్న టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. తద్వారా మహిళలు చిన్న, మధ్య తరహా కంపెనీలను (ఎస్ఎంఈ) సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళల ఉద్యోగాలు, ప్రోత్సాహానికి సంబంధించి విధాన మార్పులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు వృద్ధులు, పిల్లల సంరక్షణ పరిశ్రమగా చేసుకుంటే అక్కడ భారీ అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ అన్నారు. అలాగే సాంప్రదాయేతర రంగాల్లో మహిళల రోల్-మోడళ్లను తాము సృష్టించామని పేర్కొన్న ఆయన విద్యావంతులైన మహిళలకు మాత్రమే అంటూ వారిని ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించారు. చీఫ్ ఎకనామిస్ట్, పాలసీ అడ్వకసీ టాటా సన్స్ హెడ్ రూప పురుషోత్తమన్తో కలిసి చంద్రశేఖరన్ రచించిన "బ్రిడ్జిటల్ నేషన్" పుస్తకం ఆవిష్కరణ సందర్బంగా చంద్రశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు.