రెనాల్ట్ : 15 వేల మంది తొలగింపు

30 May, 2020 09:33 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ  రెనాల్ట్  చేరింది. అమ్మకాలు మందగించడంతో 15 వేల మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది.  అలాగే కొన్ని ప్లాంట్లను పునర్వవస్థీకరణ చేయనున్నామనీ, ఇందుకు యూనియన్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. 

ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని  కంపెనీ ప్రకటించింది. వీరిలో ప్రధానంగా ఫ్రాన్స్‌కు చెందిన 4,600 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చేమూడేళ్లలో దాదాపు రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుత 40 లక్షల కార్ల  ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2024 నాటికి  33 లక్షలకు తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఉత్పత్తిలో కోత విధించి, మరింత లాభదాయకమైన మోడళ్లపై దృష్టిపెట్టనుంది.   (12 వేల మందిని తొలగించనున్న బోయింగ్)

కాగా కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా  చిన్నా, పెద్ద వ్యాపార సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.  దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో  జీతాలలో కోత ఉద్యోగులను తొలగించడం చేస్తున్న సంగతి తెలిసిందే. (కోవిడ్‌-19: రోల్స్‌ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన)

మరిన్ని వార్తలు