వినియోగదారులకు ఆర్‌బీఐ ఊరట

22 May, 2020 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. 

‘భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నాయి. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముడి పదార్థాల ఇన్‌పుట్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోంది. తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి ఊరట లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తాం. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గింది. 4 కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిడ్‌బీ రుణాలపై మారటోరియం మరో 90 రోజులు పెంపు ఉంటుంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగింపు ఉంటుంది. టర్మ్‌లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుంది’ అని శక్తికాంత్ దాస్ అన్నారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్‌ 17న రెండోసారి కోవిడ్‌ -19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిడ్‌-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్‌ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు.

మరిన్ని వార్తలు