బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై ఆర్‌బీఐ కొరడా 

21 Dec, 2017 00:17 IST|Sakshi

న్యూఢిల్లీ: మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ)పై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. బీఓఐ తాజాగా రుణాలు జారీ చేయరాదని, డివిడెండ్‌ను పంపిణీ చేయకూడదని ఆంక్షలు విధించింది.  సత్వర దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. వరుసగా రెండేళ్ల పాటు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటం, సెట్‌ వన్‌ మూలధనం తగినంతగా లేకపోవడం, ఆస్తులపై రాబడి (రిటర్న్‌ ఆన్‌ అసెట్‌) రుణాత్మకంగా ఉండటం వంటి కారణాల వల్ల ఆర్‌బీఐ తాజాగా ఈ ఆంక్షలు విధించిందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 4 శాతం తగ్గి రూ.174 వద్ద ముగిసింది.మరోవైపు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటంతో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై ఆర్‌బీఐ అదనపు ఆంక్షలను విధించింది. అయితే డిపాజిట్ల సమీకరణ, రుణ మంజూరు, ట్రెజరీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని ఈ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు తెలిపింది.  

మెరుగుపడిన బీఓఐ రుణ నాణ్యత: గత ఏడాది మార్చి చివరి నాటికి 13.07%గా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 13.22%కి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 7.79% నుంచి 6.90%కి తగ్గాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 13.45% నుంచి 12.62%కి, నికర మొండి బకాయిలు 7.56% నుంచి 6.47%కి తగ్గాయి.  

మరిన్ని వార్తలు