పీఎన్‌బీ డిపాజిట్ల సమీకరణపై హాంకాంగ్‌లో ఆంక్షలు

15 Jun, 2018 00:51 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి (సీఏఆర్‌) నిర్దేశిత స్థాయి కన్నా తగ్గిపోవడంతో తమ దేశంలోని పంజాబ్‌  నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుల శాఖలు మరిన్ని డిపాజిట్లు సమీకరించకుండా హాంకాంగ్‌ మానిటరీ అథారిటీ (హెచ్‌కేఎంఏ) ఆంక్షలు విధించింది.పంజాబ్‌  నేషనల్‌ బ్యాంక్‌  క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి.. 2017 మార్చిలో 11.66 శాతంగా ఉండగా, 2018 మార్చి ఆఖరు నాటికి 9.2 శాతానికి తగ్గిపోయింది.

అటు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) సీఏఆర్‌ కూడా అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని 10.50 శాతంతో పోలిస్తే 9.25 శాతానికి తగ్గిపోయింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ఇది 11.5 శాతం పైగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే హెచ్‌కేఎంఏ తమ శాఖలపై నియంత్రణలపరమైన పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పీఎన్‌బీ, ఐవోబీ తెలిపాయి. వాణిజ్య రుణాలకు ప్రతిగా తీసుకున్న డిపాజిట్లకు తాజా ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని  పేర్కొన్నాయి.   

>
మరిన్ని వార్తలు