రిటర్నులు ఎందుకు..?

13 Jun, 2016 01:01 IST|Sakshi
రిటర్నులు ఎందుకు..?

చాలామంది రిటర్నులు ఎందుకు వెయ్యాలి అని అడుగుతారు. పాన్ ఉంటే వెయ్యాలి.. పాన్ లేకపోతే మంచిదే కదా.. మనం అస్సలు రిటర్ను వేయనక్కర్లేదు కదా.. మాకు ఆదాయం లేదు.. అయినా వెయ్యాలా? బంగారం ఉంటే.. కొంటే వెయ్యాలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు .. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక్క జవాబు.. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే..
 
మీ వయస్సును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్ దాటి మీ నికర ఆదాయం ఉంటే రిటర్ను దాఖలు చేయాలి. నికర ఆదాయాన్ని లెక్కించండి. ఇదంతా చట్టాల కోసమేనని ఆలోచించకండి. దీనివల్ల ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
 
చట్టాన్ని గౌరవించండి..
పైన చెప్పిన విధంగా చట్టప్రకారం మీ గురుతరబాధ్యత నిర్వర్తించండి. కంపెనీల్లో డెరైక్టర్లూ రిటర్నులు దాఖలు చేయాలి.. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములూ వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంటున్నా.. రిటర్నులు వేయాలి. విదేశాల్లో ఆస్తులున్నాయి.. రిటర్నులు వేయాలండి. అంతే కాకుండా విదేశీ సంస్థల్లో పెట్టుబడులుంటే రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సబుల్ ఇన్‌కం లేకపోయినా విదేశాల్లో ఉన్న అంశాలను రిటర్నుల్లో పొందుపర్చాలి.
 
రీఫండ్‌లు పొందాలంటే,,
చెల్లింపులు చేసే ప్రతివారు టీడీయస్ చేస్తున్నారు. అంటే మూలాల్లోనే కోత. కొంతమందికి ట్యాక్సబుల్ ఇన్‌కం దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువవటం వలన కోత అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాకు జమయినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కానీ రీఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు. రీఫండ్ ఉంది అంటే.. ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి సుమా.
 
డిడక్షన్లు క్లెయిమ్ చేయాలంటే..

అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80సీ, 80డీ, 80డీడీ, 80ఈ .. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అన్నింటికి కాగితాలు ఉండాలి. రిటర్నులతో బాటు జతపర్చకపోయినా భద్రపర్చుకోవాలి. క్లెయిం కోసం స్థూల ఆదాయం లోంచి వీటిని మినహాయిస్తారు. కానీ స్థూల ఆదాయం మారవచ్చు.. ఉద్యోగస్తులకు ఎరియర్స్ రావొచ్చు.. ఇతరులకు గత ఆదాయం ఇప్పుడు రావొచ్చు.

అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లే. ఉదాహరణకు.. మీ స్థూల ఆదాయం రూ. 3 లక్షల యితే.. 80సీ కింద రూ. 1,50,000 చెల్లించారనుకోండి.. ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 1,50,000 అవుతుంది.. పన్ను భారం ఏదు. ఇటువంటి సందర్భంలో ఏదైనా కారణం వలన ఆదాయం రూ. 1,00,000 పెరిగిందనుకోండి.. గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారం తగ్గిస్తుంది.

షేర్లు అమ్ముతున్నారా..
షేర్ల లావాదేవీలలో.. నష్టం రావొచ్చు.. లాభం రావొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్‌కం సరే, లావాదేవీల్లో నష్టం రావచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా.. రాబోయే 8 సం.లు సర్దవచ్చు. అందువలన ఖచ్చితంగా ఈ లావాదేవీలను చూపించుతూ రిటర్నులు దాఖలు చేయండి.
 
అమెరికా నుంచి అబ్బాయి పంపిస్తే..
విదేశాల నుంచి మీ అబ్బాయి/అమ్మాయి లేదా దగ్గర బంధువులు డబ్బులు పంపుతున్నారా. భయపడక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం, మీ అకౌంటులో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే ఎన్నో ఆదాయాలు పన్నుకి గురికానివి ఉన్నాయి. గ్రాట్యుటీ, జీవిత బీమా మొదలైనవి ఆ కోవకి చెందినవే. ఇవన్నీ డిక్లేర్ చేస్తూ రిటర్నులు వేయండి. డిపార్ట్‌మెంట్ వారు అడిగినప్పుడు వివరణలు ఇవ్వవచ్చు.
 
మరెన్నో ప్రయోజనాలు..
వీసా అధికారులు, బ్యాంకు అధికారులు, మీకు అప్పు ఇచ్చే వాళ్లు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, కొన్ని సంస్థలు.. ఇలా ఎందరో ఆదిలోనే అడుగుతున్నారు మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు.. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి.
- ట్యాక్సేషన్ నిపుణులు
 కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్‌లావణ్య

మరిన్ని వార్తలు