‘జియో గిగాఫైబర్‌’ను ప్రవేశపెట్టిన రిలయన్స్‌

5 Jul, 2018 11:41 IST|Sakshi

ముంబై : దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్‌ ఛేంజర్‌ ఫైబర్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు‘ జియోగిగాఫైబర్‌’ ను రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్‌ అంబానీలు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. నేడు ముంబైలోని  న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన  41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. జియోగిగాఫైబర్‌ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్‌, ఇషా అంబానీలు ప్రజెంటేషన్‌ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు ముఖేష్‌ అంబానీ చెప్పారు. సెటాప్‌బాక్స్‌ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్‌ సేవలను అందించనున్నట్టు ఆకాశ్‌, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్‌ హోమ్‌ టెక్నాలజీ, టీవీ కాలింగ్‌లు జియోగిగాఫైబర్‌ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు. జియో.కామ్‌ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్‌’ సర్వీసులను రిజిస్టర్‌ చేసుకోవచ్చని రిలయన్స్‌ పేర్కొంది.

మూడు ముఖ్యమైన యాప్స్‌ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను జియో ఫోన్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్‌, ఇషాలు చెప్పారు. జియో ఫోన్‌లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూపించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్‌ అంబానీ తెలిపారు. జియోఫోన్‌ హైఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను కూడా ఇషా, ఆకాశ్‌లు ప్రవేశపెట్టారు. 

గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్‌ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్‌చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్‌ - 5 బ్రాడ్‌బ్యాండ్‌ దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

ముఖేష్‌ అంబానీ ప్రసంగంలో పలు ముఖ్యాంశాలు :

  • 2,999 రూపాయలకే జియోఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2
  • జియోఫోన్‌కు మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌, కేవలం రూ.501కే పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొత్త జియోఫోన్‌
  • జియోగిగాపైబర్‌ నెట్‌వర్క్‌ను గంట కంటే తక్కువ వ్యవధిలోనే కంపెనీ సర్వీసుమెన్‌ ఇన్‌స్టాల్‌
  • బ్రాడ్‌బ్యాండ్‌ వాడకంలో ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్‌ 134వ స్థానంలో ఉంది. దీనిలో ప్రపంచంలో టాప్‌-5లో భారత్‌ను ఒకటిగా చేరుస్తాం
  • ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌దే రాబోయే భవిష్యత్తు కాలం
  • బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ను జియోగిగాఫైబర్‌ హోమ్‌ ద్వారా యాక్సస్‌
  • రియల్‌ టైమ్‌ మెడికల్‌ సూచనలు అందుబాటు
  • జియోగిగా టీవీ లాంచ్‌ చేసిన రిలయన్స్‌, 4కే రెజుల్యూషన్‌లో వీడియో ప్లే
  • అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు
  • కేవలం 22 నెలల కాలంలోనే జియోకు 215 మిలియన్‌ కస్టమర్లు
  • డేటా వాడకం నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 కోట్ల జీబీకి పైగా పెరిగింది
  • వాయిస్‌ వాడకం ప్రతి రోజూ 250 కోట్ల నిమిషాల నుంచి 530 కోట్ల నిమిషాలకు చేరింది
  • వీడియో వాడకం 165 కోట్ల గంటల నుంచి 340 కోట్ల గంటలకు పెరిగింది
  • అనూహ్యమైన నెట్‌వర్క్‌ వృద్ది గుర్తింపును సాధిస్తూనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని విజయవంతంగా కలిగి ఉండగలిగాం. గతేడాది ప్రతి నెలలోనూ ట్రాయ్‌ స్పీడ్‌ టెస్ట్‌ డేటాలో భారత్‌లో ఫాస్టెస్ట్‌ నెట్‌వర్క్‌ గుర్తింపును తెచ్చుకుంది
  • భారత ఎగుమతుల్లో రిలయన్స్‌ వాటా 8.9 శాతం
  • 20.6 శాతం పెరిగిన రిలయన్స్‌ నికర లాభాలు
  • ప్రైవేట్‌ కంపెనీలో అత్యధిక పన్ను చెల్లింపుదారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 2018లో రూ.9844 కోట్ల పన్ను చెల్లింపు
  • రిలయన్స్‌ రిటైల్‌ : గతేడాది 3500 స్టోర్లు ప్రారంభం, ఈ ఏడాది 4 వేలకు పైగా ప్రారంభించనున్నట్టు తెలిపిన ముఖేష్‌
  • 5 లక్షల టన్నుల గ్రోసరీలు అమ్మిన రిలయన్స్‌ రిటైల్‌
మరిన్ని వార్తలు