కార్యాలయాల మూసివేత దిశగా రాయల్ ఎన్‌ఫీల్డ్

13 Jun, 2020 20:11 IST|Sakshi

ముంబై: దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. వ్యాపారాన్ని పుంజుకునేందుకు అనేక చర్యలు చేపట్టబోతుంది. దేశంలోని డజన్‌కుపైగా ప్రాంతీయ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు గుర్గావ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్ తదితర రాష్ట్రాలలో ప్రాంతీయ కార్యాలయాలను వేంటనే మూసివేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల తొలగింపు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యాలయాల మూసివేతపై  పరిపాలన విభాగం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయ మూసివేత నిర్ణయంపై సీసీఓ(చీఫ్ కమర్షియల్ ఆఫీసర్) లలిత్‌ మాలిక్‌ దృవీకరించారు.

ఆయన విలేకర్ల సమావేశంలో స్పందిస్తు.. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేత నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీని ద్వారా తమ ఉద్యోగులకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుతం లాక్‌డౌన్‌ను సడలించడం ద్వారా తమ అమ్మకాలు పుంజుకున్నాయని రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. దేశంలో సంస్థ డీలర్‌షిప్‌లను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100కుపైగా నూతన రిటైల్‌ స్టోర్స్‌ను తెరవబోతున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక బైక్‌ల‌ రూపకల్పనలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక స్థానం సాధించిన విషయం తెలిసిందే.
(చదవండి: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ : తక్కువ ధరలో)

మరిన్ని వార్తలు