రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బైక్‌

29 Aug, 2018 00:13 IST|Sakshi

క్లాసిక్‌ సిగ్నల్స్‌ 350 @ రూ.1,58,861   

బెంగళూరు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ కొత్త మోడల్‌ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. క్లాసిక్‌ సిగ్నల్స్‌ 350 పేరుతో అందిస్తున్న ఈ బైక్‌  ధర రూ.1,58,861గా (ఎక్స్‌ షోరూమ్, బెంగళూరు) నిర్ణయించినట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  కంపెనీ బిజినెస్‌ హెడ్‌ (ఇండియా) షాజి కోషే చెప్పారు. ఈ కొత్త బైక్‌ రెండు రంగుల్లో లభ్యమవుతుందని చెప్పారాయన.

స్టీల్‌ ఇంజిన్‌ గార్డ్స్‌ వంటి 40 ప్రత్యేక యాక్సెసరీలతో ఈ బైక్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బైక్‌ను 346 సీసీ ఎయిర్‌–కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు,  క్రాష్‌ గార్డ్స్, పెద్ద విండ్‌స్క్రీన్లు వంటి ప్రత్యేకతలున్నాయని చెప్పారు.

ఐదేళ్లలో 50 శాతానికి మించిన వృద్ధి...
‘‘గత ఐదేళ్లలో 50%కి మించిన వృద్ధిని సాధించాం. అంతర్జాతీయ మిడ్‌–సైజ్‌ మోటార్‌ సైకిల్‌ మార్కెట్లో ప్రధాన కంపెనీగా ఎదిగాం.  కంపెనీ నిర్వహణలో ఉన్న 17 షోరూమ్‌లతో పాటు 705కు పైగా డీలర్ల ద్వారా  విక్రయాలు జరుపుతున్నాం. అమెరికా, ఇంగ్లాండ్, యూరప్, లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో సహా మొత్తం 50కు పైగా దేశాలకు బైక్‌లు ఎగుమతి చేస్తున్నాం’’ అని షాజీ కోషే వివరించారు. 1950 నుంచి భారత సైనిక దళాలకు ఈ బైక్‌ల సరఫరాలను ప్రారంభించామని, భారత సైన్యానికి అత్యధిక బైక్‌లను సరఫరా చేసిన ఘనత తమదేనని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ రుద్రతేజ్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు