రూ.1200కోట్లకు ‘ఆన్‌లైన్‌ మాట్రిమోనీ’

25 Apr, 2019 01:10 IST|Sakshi

వీడియో మాట్రిమోనీని ఆరంభించిన ‘దిల్‌కే రిస్తే’  

హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: భారత్‌లో ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ వచ్చే ఏడాదికి రూ.1,200 కోట్లకు చేరుతుందని ‘దిల్‌కే రిస్తే’ వ్యవస్థాపకుడు సురేశ్‌ నాయర్‌ చెప్పారు. దేశంలో మొట్టమొదటి వీడియో మాట్రిమోనీ సైట్‌ ‘దిల్‌కేరిస్తే డాట్‌కామ్‌’ను ఆరంభించిన సందర్భంగా మాట్లాడుతూ‘‘ ప్రస్తుతం ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ విలువ రూ.1,000 కోట్లని, ఇందులో దాదాపు 80 శాతం వాటా టాప్‌ 3 సైట్లదేనని (భారత్‌ మాట్రిమోని, షాదీ, జీవన్‌సాథీ) చెప్పారు. మాట్రిమోనీ మార్కెట్లో ప్రస్తుతం దాదాపు 43 లక్షల మంది సభ్యులున్నారన్నారు. వచ్చే రెండేళ్లలో మొత్తం మాట్రిమోనీ మార్కెట్‌ రెవెన్యూలో 10 శాతం, సబ్‌స్క్రైబర్లలో 25 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో జరిగే వివాహాల్లో మాట్రిమోనీ సైట్ల ద్వారా జరిగే వివాహాల శాతం కేవలం 6 శాతమేనని, ఈ రంగంలో విస్తరించేందుకు అపార అవకాశముందని వివరించారు. మాట్రిమోనీ సైట్‌ ప్రొఫైల్స్‌లో 60 శాతం వాటా మగవారిది కాగా, 40 శాతం ప్రొఫైల్స్‌ మహిళలవని తెలిపారు.  

తొలి వీడియో మాట్రిమోనీ సైట్‌ 
ఈ మార్కెట్లో ఇంతవరకు వీడియో ఆధారిత ప్రొఫైల్స్‌తో కూడిన మాట్రిమోనీ సైట్‌ లేదని, అందుకే తాము ప్రవేశపెట్టామని సురేశ్‌ నాయర్‌ తెలిపారు. తమ సైట్లో మొదటి మూడు నెలలు రిజిస్ట్రేషన్‌ ఉచితమన్నారు. సభ్యులు సొంతంగా 1– 1.5 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ప్రొఫెషనల్‌ వీడియో కావాలంటే రూ.6వేలు ఫీజుతో తాము తయారు చేసి అప్‌లోడ్‌ చేస్తామన్నారు. ఇందుకోసం నగరంలో తాము 11 స్టూడియోలు ఏర్పరిచామన్నారు. వీడియోలతో సభ్యుల గురించి అవతలవారికి సరైన అవగాహన వస్తుందన్నారు. తమ సైట్లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెంబర్‌ డిస్‌ప్లే చేయకుండా వీడియో కాలింగ్, ఆన్‌లైన్‌ చాటింగ్, హారోస్కోప్‌ మ్యాచింగ్‌ తదితర ప్రత్యేక సేవలను తమ సైట్లో అందిస్తున్నామన్నారు. తొలి ఏడాదిలో కనీసం 30వేల సభ్యులను లకి‡్ష్యస్తున్నామని తెలిపారు.   

మరిన్ని వార్తలు