రూ.15 వేల కోట్ల గోల్డ్ బాండ్‌లు వస్తున్నాయ్!

27 Jul, 2015 00:49 IST|Sakshi
రూ.15 వేల కోట్ల గోల్డ్ బాండ్‌లు వస్తున్నాయ్!

ద్వితీయార్ధంలో జారీకి కేంద్రం ప్రణాళికలు
 
 న్యూఢిల్లీ : బంగారానికి డిమాండ్ తగ్గించడం కోసం కేంద్రం సావరీన్ గోల్డ్ బాండ్‌ల జారీకి చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (2015-16, అక్టోబర్-మార్చి)లో రూ.15,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్‌లను జరీచేసే ప్రణాళికల్లో ఉంది. ఈ బాండ్‌ల స్కీమ్‌కు సంబంధించి మరో నెలరోజుల్లో కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర లభించే అవకాశాలున్నాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు విడతలవారీగా ఈ బాండ్‌ల జారీని చేపట్టనునున్నారు. ప్రతియేటా భారతీయులు కొనుగోలు చేసే దాదాపు 300 టన్నుల విలువైన పుత్తడిలో(కడ్డీలు, నాణేల రూపంలో) కొంత భాగాన్ని డీమ్యాట్ రూపంలో ఉండే గోల్డ్ బాండ్‌లలోకి మళ్లించాలనేది ప్రతిపాదిత పథకం ఉద్దేశం.

పోస్టాఫీసులు, బ్రోకర్ల ద్వారా ఈ గోల్డ్ బాండ్‌లను విక్రయించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణలో భాగంగానే ఈ గోల్డ్ బాండ్ పథకం ఉంటుంది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించడంతో పాటు నిధుల సమీకరణకు కూడా ఈ స్కీమ్ వీలు కల్పిస్తుందనేది ప్రభుత్వం యోచన. ప్రతిపాదితన స్కీమ్ ప్రకారం... 2, 5, 10 గ్రాములతో పాటు ఇతరత్రా డినామినేషన్లలో బంగారానికి సమానమైన విలువగల గోల్డ్ బాండ్‌లను ప్రభుత్వం జారీ చేస్తుంది. కనీస కాలపరిమితి 5-7 ఏళ్లుగా ఉంటుంది. నిర్ధేశిత వడ్డీరేటు ఆధారంగా వచ్చే రాబడిని మెచ్యూరిటీ తర్వాత బంగారం రూపంలోనే చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు