రూ.2 వేల నోటుపై బ్యాంకు కీలక నిర్ణయం

23 Feb, 2020 15:19 IST|Sakshi

చెన్నై: రూ.2 వేల నోటు విషయంలో ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తన ఏటీఎమ్‌లలో పెద్ద నోటు లభ్యం కాదని స్పష్టీకరించింది. రెండువేల నోటును రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో బ్యాంకు నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏటీఎమ్‌లలో రెండు వేల నోటు నింపడం ఆపివేయాలంటూ ఇండియన్‌ బ్యాంకు సంబంధింత బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఇకమీదట తన ఏటీఎమ్‌లలో రెండు వేల నోటు కనిపించదని, దానికి బదులుగా రూ.200 నోటును అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.(రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!)

వినియోగదారుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో మార్చి 1 నుంచి ఇండియన్‌ బ్యాంకు ఏటీఎమ్‌లలో రూ.2 వేల నోటు అదృశ్యం కానుంది. కాగా ఇప్పటికే వినియోగదారులు సైతం ఏటీఎమ్‌లలో తీసుకుంటున్న పెద్ద నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకుంటున్నారు. మరోవైపు మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో వెళతాయేమోనని కొందరు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.(రెండు వేల నోటు, మరో షాకింగ్‌ న్యూస్‌)

మరిన్ని వార్తలు