ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ నానాటికీ పతనమవుతోంది. చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు కారణంగా డాలర్తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయిని(ఇంట్రాడేలో) తాకింది. నానాటికి తీసికట్టు అన్నట్టుగా రూపాయి విలువ గురువారం రూ 65.01 మార్కును తాకింది. దీంతో మరో రికార్డు స్థాయికి రూపాయి దిగజారేలా కనిపిస్తోందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో 2013 ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో 65 రూపాయల స్థాయికి పడిపోయిన భారత కరెన్సీ విలువ ఇపుడు మళ్లీ అదే స్థాయి కి చేరుకుంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఇండియా రూపాయి పతన నిరోధానికి ఆలోచిస్తోంది. తన దగ్గర డాలర్ల అమ్మకాలకు చూస్తున్నట్టు సమాచారం.
చైనా కరెన్సీ యువాన్ను రెండో రోజూ డీ వాల్యూ చేయడం అంతర్జాతీయంగా రూపాయి విలువను దెబ్బతీసింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ హావా కొనసాగడంతో యూరో, పౌండ్ల మారకం విలువ కూడా పతనమైంది. గ్రీస్లో ఏర్పడిన సంక్షోభం, ఫెడరల్ వడ్డీ రేట్లపై స్పెక్యులేషన్ వార్తలతో డాలర్కు బాగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది.. దీంతో రిటైల్ మదుపర్లు డాలర్ కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబర్చారు. ఫలితంగా రూపాయి విలువ మరింత దిగజారిందని బ్రోకర్లు అంటున్నారు. దీని ప్రభావం స్టాక్మార్కెట్లపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.