సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రారంభంలోనే సాంకేతికంగా కీలకమైన 72 దిగువకు చేరింది. అనంతరం మరింత పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 74 పైసలు (1 శాతం పైగా) కోల్పోయి 72.16 స్థాయికి చేరింది. ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ఐఐల భారీ అమ్మకాలు, ముడి చమురు, బంగారం ధరలు పెరుగుతుండటం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నట్లు నిపుణుల అంచనా.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో తిరిగి డాలరు ఊపందుకోవడంతో వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం, ఈ నెల మధ్యలో చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు.. డాలరు బలాన్నిస్తున్నాయి.. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 99ను అధిగమించగా.. రూపాయి ప్రారంభంలోనే 64 పైసలు క్షీణించడం గమనార్హం.
మరోవైపు జీడీపీ జీడీపీ 5 శాతానికి పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ప్రస్తుతం సెన్సెక్స్ 56 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 167 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్ 37 వేల దిగువకు, నిఫ్టీ 10900 స్థాయిని కోల్పోయి బలహీన సంకేతాలనిస్తున్నాయి.