71.21కి జారిపోయిన రూపాయి

4 Sep, 2018 00:50 IST|Sakshi

కొత్త జీవితకాల కనిష్టం వద్ద ముగింపు

చమురు ధరలు, వాణిజ్య యుద్ధం భయాల ప్రభావం  

ముంబై: దేశీ కరెన్సీ రూపాయి మరింత బక్కచిక్కిపోతోంది. తాజాగా సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లో నూతన జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్‌ మారకంలో 21 పైసలు నష్టపోయి 71.21 వద్ద నిలిచింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. జీడీపీ గణాంకాలకు తోడు సాంకేతిక దన్నుతో రూపాయి ఆరంభం గట్టిగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఫారెక్స్‌ మార్కెట్లో పరిస్థితి మారిపోయింది. ఇన్వెస్టర్లలో భయం నెలకొనడంతో రూపాయి తన విలువను కోల్పోయింది. ప్రభుత్వం ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు.

ముఖ్యంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు బ్యారెల్‌ 78 డాలర్లకు చేరడం ట్రేడింగ్‌ వాతావరణాన్ని మార్చేసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు నవంబర్‌ నుంచి అమల్లోకి వస్తే ఆ దేశం నుంచి చమురు ఉత్పత్తి తగ్గిపోయి, అది ధరలపై ప్రతిఫలిస్తుందన్న ఆందోళన పెరగడం చమురు ధరలకు ఆజ్యం పోయవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఒపెక్‌ నుంచి ఉత్పత్తి పెరిగినా అది పరిమితంగానే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 8.2 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి ఈ స్థాయిలో నమోదు కావడం సానుకూలమనే చెప్పుకోవాలి.

అయినా రూపాయి పతనాన్ని ఇది నిలువరించలేకపోయింది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెంపు, విదేశీ కరెన్సీ నిల్వలు పెంచుకోవడం తదితర చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినా గానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 11 శాతం మేర తన విలువను కోల్పోయింది. సోమవారం ఆసియాలో అత్యంత దారుణ పనితీరు రూపాయిదే.  

అస్థిర కరెన్సీ ఎగుమతులకు మంచిది కాదు: ఈఈపీసీ  
రూపాయి విలువ పతనం భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందన్న అంచనాలకు విరుద్ధంగా ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) స్పందించింది. కరెన్సీ అస్థిరత అన్ని వేళలా ప్రయోజనాలు చేకూర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

‘‘కరెన్సీ స్థిరంగా ఉంటేనే ఎగుమతులకు సానుకూలం. అంచనాల ఆధారంగా కొనుగోలు దారులతో వ్యవహారాలు నిర్వహించేందుకు వీలవుతుంది. అస్థిరతలు, ఆటుపోట్లన్నవి ఏ వైపు ఉన్నా కానీ దాంతో ఉపయోగం ఉండదు’’ అని ఈఈపీసీ ఇండియా చైర్మన్‌ రవి సెహగల్‌ తెలిపారు. దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతుల వృద్ధి జూలైలో ఒక అంకె స్థాయి 9.4 శాతానికి తగ్గిపోయిందని ఈఈపీసీ తెలిపింది. అంతకుముందు నెలల్లో ఉన్న పెరుగుదల నుంచి పడిపోయినట్టు వివరించింది.

మరిన్ని వార్తలు