సాక్షి, ముంబై : ఒకవైపు ఈక్విటీ మార్కెట్లు లాభాల దౌడు తీస్తోంటే..మరోవైపు వరుసగా ఐదో రోజు కూడా దేశీయ కరెన్సీ తన జోరును కొనసాగించింది. డాలరుతో మారకంలో ట్రేడింగ్ ప్రారంభంలోనే నిన్నటి ముగింపుతో పోలిస్తే బాగా పుంజుకుంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 24 పైసలు(0.36 శాతం) ఎగసి 69.10కు చేరింది. ఇంట్రా డేలో 69.03 స్తాయిని టచ్ చేసింది. దీంతో ఏడు నెలల గరిష్టాన్ని తాకింది. 2019లో ఇది గరిష్టం. కాగా 2018 ఆగస్ట్ 10న రూపాయి ఈ స్థాయికి చేరింది. గత నాలుగు రోజుల్లో రూపాయి 80 పైసలు పురోగమించింది. గురువారం సైతం రూపాయి 20 పైసలు పుంజుకుని 69.34 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
స్టాక్మార్కెట్ల లాభాలకు తోడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) పెట్టుబడులు ఊపందుకున్నాయి. మరోపక్క రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ బూస్ట్ రూపాయికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. విదేశీ మారక స్వాపింగ్ ద్వారా 5 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గురువారం ఆర్బీఐ ప్రకటించింది. ఈ అంశాల నేపథ్యంలో రూపాయికి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.