కరోనా కాటు: రూపాయి పాతాళానికి 

23 Mar, 2020 10:53 IST|Sakshi

సాక్షి, ముంబై:  డాలరు మారకంలో రూపాయి పాతాళానికి పడిపోయింది. వరుసగా  అత్యంత కనిష్ట స్థాయికి దిగజారుతున్న దేశీయ కరెన్సీ  సోమవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. ఏకంగా 95 పైసలు క్షీణించి  76.15 వద్దకు చేరింది. ఇది చారిత్రక కనిష్టం. దేశంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరగడం, దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 75.90 కు క్షీణించింది.  

శుక్రవారం అమెరికా డాలర్‌తో 75.20 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి కారణంగా ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నందున పెట్టుబడిదారులలో ఆందోళన చెందుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 390 కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 400 కేసులు నమోదు కావడం ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న ఆంచనాలు వ్యాపించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.74 శాతం పడిపోయి బ్యారెల్కు 26.24 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీల  గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.52 శాతం తగ్గి 102.28 వద్దకు చేరుకుంది. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.31 శాతంగా ఉంది. కాగా దేశీయ స్టాక్  మార్కెట్లలో సెన్సెక్స్ దాదాపు  మూడు వేల పాయింట్లు, నిఫ్టీ 842 పాయింట్లు (10 శాతం లోయర్ సర్క్యూట్ ) పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ను నిలిపి వేశారు.

చదవండి: మీరే అసలైన హీరో.. కరోనాపై పోరుకు రూ.100కోట్లు

మరిన్ని వార్తలు