సీపీఎస్యూల కీలకం కాని ఆస్తుల విక్రయం
మార్గదర్శకాలను జారీచేసిన దీపమ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్యూ)లు కీలకం కాని తమ ఆస్తుల విక్రయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ సీపీఎస్యూలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తారు. ఈ మేరకు సీసీఎస్యూల ఆస్తుల విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను దీపమ్ జారీ చేసింది. దీంతో పాటు శతృ సంస్థల స్థిరాస్థుల విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా దీపమ్ వెల్లడించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.., దీపమ్ కార్యదర్శి అధ్యక్షతన గల అంతర మంత్రిత్వ సంఘం(ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్–ఐఎమ్జీ) సీపీఎస్యూల కీలకం కాని ఆస్తులను గుర్తిస్తుంది.
ఇలా గుర్తించడంలో ఐఎమ్జీ స్వతంత్రంగా గానీ, నీతి ఆయోగ్ సూచనలను గానీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్థిక మంత్రి, రహదారుల మంత్రి, సంబంధిత శాఖ నిర్వహణ మంత్రులు సభ్యులుగా గల ఆల్టర్నేటివ్ మెకానిజమ్.. సీపీఎస్యూ విక్రయించాల్సని ఆస్తులకు ఆమోదం తెలుపుతుంది. ఈ ఆమోదం పొందిన ఏడాదిలోపు సదరు ఆస్తుల విక్రయం జరిగాల్సి ఉంటుంది. ఈ ఆస్తుల విక్రయానికి కావాలంటే కొంత గడువును సీపీఎస్యూలు కోరవచ్చు. మరోవైపు శతృసంస్థల స్థిరాస్తులను హోమ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.