సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్

28 Sep, 2014 02:46 IST|Sakshi
సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్

- రేటు రూ. 39,990
- అక్టోబర్ తొలి వారం నుంచి భారత మార్కెట్లో లభ్యం
న్యూఢిల్లీ: కొరియన్ హ్యాండ్‌సెట్ దిగ్గజం సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ సిరీస్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 39,900. గెలాక్సీ అల్ఫా పేరిట ఇది అక్టోబర్ తొలివారం నుంచి భారత మార్కెట్లో లభ్యం కానుంది. 4.7 అంగుళాల హెచ్‌డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 12 ఎంపీ రియర్ కెమెరా మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్ రేట్ మానిటర్ ఫీచర్లతో పాటు గేర్ ఫిట్ గేర్ 2 మొదలైన సామ్‌సంగ్ వేరబుల్ డివైజ్‌లతో ఇది నేరుగా అనుసంధానం కాగలదు.

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో కలసి సామ్‌సంగ్ దీన్ని ప్రవేశపెడుతోంది. ఎయిర్‌టెల్ 4జీ సర్వీసులు ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల పాటు 5 జీబీ మేర 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాబోయే రోజుల్లో రూ.40,000 కన్నా తక్కువ ధరలోనే మరిన్ని 4జీ హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మొబైల్ అండ్ ఐటీ) అసిమ్ వర్సి తెలిపారు.
 

మరిన్ని వార్తలు