స్పెషల్ కెమెరాతో శామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్

9 Jul, 2014 00:45 IST|Sakshi
స్పెషల్ కెమెరాతో శామ్‌సంగ్ గెలాక్సీ కే జూమ్

హైదరాబాద్: శామ్‌సంగ్  ఎలక్ట్రానిక్స్ ఇండియా కంపెనీ ప్రత్యేకమైన కెమెరాతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ కే జూమ్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌ను డిజిటల్ కెమెరా టెక్నాలజీతో పొందాలనుకునే వారి కోసం ఈ గెలాక్సీ కే జూమ్‌ను అందిస్తున్నామని శామ్‌సంగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నేటి(బుధవారం) నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని, ధర రూ.29,999 అని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్, మొబైల్ అండ్ ఐటీ)అసిమ్ వార్సి పేర్కొన్నారు.

 ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 4.8 అంగుళాల హెచ్‌డీ సూపర్ అమోలెడ్ టచ్ స్క్రీన్, హెక్సాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 20.7 మెగా పిక్సెల్ బీఎస్‌ఐ సీఎంఓఎస్ సెన్సర్ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో ఆప్టికల్ జూమ్ 10 రెట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎస్ హెల్త్ లైఫ్ వంటి వాల్యూ యాడెడ్ ఫీచర్లు ఉన్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు