సియోల్ : కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్ఫోన్ ఆపరేషన్స్ కోసం నూతన హెడ్ను నియమించింది. హవాయి వంటి తక్కువ ధరకు లభించే ఫోన్ల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించేందుకు స్మార్ట్ఫోన్ విభాగానికి నూతన చీఫ్గా రోతే మూన్ (52)ను నియమించింది. మూన్ గతంలో కంపెనీ గెలాక్సీ స్మార్ట్ఫోన్ అభివృద్ధి బృందానికి నేతృత్వం వహించారు. చైనా,ఇతర దేశాల్లో హ్యాండ్సెట్ తయారీని థర్డ్ పార్టీలకు అవుట్సోర్స్ చేస్తూ వ్యూహాత్మక విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు.
ప్రపంచంలోనే కంప్యూటర్ చిప్స్, డిస్ప్లే ప్యానెల్స్, స్మార్ట్ఫోన్ల తయారీలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన శాంసంగ్ గత ఐదు క్వార్టర్లలో ఆశించిన రాబడి ఆర్జించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతన నియామకాలు చేపట్టింది. స్మార్ట్ఫోన్ చీఫ్ ఎంపికతో పాటు నలుగురు యువ ప్రొఫెషనల్స్కు వివిధ విభాగాలకు అధ్యక్షులుగా నియమించింది. ఇక గతంలో స్మార్ట్ఫోన్ చీఫ్గా వ్యవహరించిన డీజే కో శాంసంగ్ ఐటీ, మొబైల్ డివిజన్ బాధ్యతలను పర్యవేక్షిస్తారు.