శాంసంగ్ నోట్ 7.. ఆగిపోతుందా?

10 Oct, 2016 09:12 IST|Sakshi
శాంసంగ్ నోట్ 7.. ఆగిపోతుందా?

కొత్త బ్యాటరీలతో మార్చి ఇచ్చిన తర్వాత కూడా ఫోన్లు పేలిపోతుండటంతో తాము ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గెలాక్సీ నోట్ 7 ఫోన్ల ఉత్పత్తిని శాంసంగ్ కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసిందని తెలుస్తోంది. చాలా ఫోన్లను రీకాల్ చేసి, వాటి బదులు కొత్త ఫోన్లు ఇచ్చినా, బ్యాటరీలో సమస్యను పరిష్కరించినట్లు చెప్పినా.. ఇప్పటికీ మళ్లీ మళ్లీ ఫోన్లలోంచి మంటలు వస్తుండటంతో తాత్కాలికంగా వీటి ఉత్పత్తిని ఆపేయాలని శాంసంగ్ నిర్ణయించిందని 'యోన్‌హాప్' అనే మీడియా సంస్థ తెలిపింది.  తమ విమానాల్లో ఈ ఫోన్లను తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అమెరికాకు చెందిన రెండు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తెలిపాయి. అయితే, ఉత్పత్తి నిలిపివేతపై శాంసంగ్ మాత్రం అధికారికంగా ఇంకా స్పందించలేదు. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కూడా తమ శాంసంగ్ ఫోన్‌లో సమస్యలు ఉన్నాయని, దాన్ని మార్పించుకున్నాను కాబట్టి కొంతవరకు పర్వాలేదని భావిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే.

అమెరికాలో మొబైల్ ఫోన్ల వ్యాపారంలో రెండో స్థానంలో ఉన్న ఏటీఅండ్ టీ సంస్థ, మూడో స్థానంలో ఉన్న టి-మొబైల్ కూడా తాము శాంసంగ్ నోట్ 7 ఫోన్లను ఎక్స్చేంజి చేయడం ఆపేస్తున్నట్లు ప్రకటించాయి.  అమెరికా సహా పది దేశాల్లోని దాదాపు 25 లక్షల నోట్ 7 ఫోన్లను రీకాల్ చేస్తున్నట్లు శాంసంగ్ కంపెనీ సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటించింది. బ్యాటరీలలో సమస్య కారణంగా ఆ ఫోన్లలోంచి మంటలు వస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవలే అమెరికాలోని ఒక విమానంలో మార్చిన నోట్ 7 ఫోన్‌లోంచి కూడా మంటలు రావడంతో.. అప్పటికప్పుడు విమానం నుంచి ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు.

మరిన్ని వార్తలు