మళ్లీ టాప్‌ శాంసంగే..

2 May, 2018 13:36 IST|Sakshi

ఇటీవల కాలంలో గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు పడిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో క్వార్టర్‌లోనూ గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు క్షీణించాయి. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించిన డేటాలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో గ్లోబల్‌ లీడర్‌గా శాంసంగ్‌ కంపెనీనే అగ్రస్థానంలో ఉందని, 78 మిలియన్‌ డివైజ్‌ల విక్రయాలతో, 21.7 శాతం మార్కెట్‌ షేరును సొంతం చేసుకుందని తెలిసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో 80 మిలియన్‌ స్మార్ట్‌ఫోన్‌ యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 2 శాతం మేర కంపెనీ విక్రయాలు పడిపోయాయి. అయినప్పటికీ శాంసంగ్‌ కంపెనీనే టాప్‌లో నిలిచినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 52.2 మిలియన్‌ డివైజ్‌ రవాణాతో 14.5 శాతం మార్కెట్‌ షేరును దక్కించుకుని ఆపిల్‌ రెండో స్థానంలో నిలిచినట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డేటా వెల్లడించింది.

టాప్‌-10 ప్లేయర్లే 76 శాతం మార్కెట్‌ను ఆక్రమించుకున్నాయని, మిగతా 600 బ్రాండులు మిగిలిన 24 శాతం మార్కెట్‌ను పొందినట్టు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల సగటు విక్రయ ధర పెరుగుతూ వస్తోందని, ఎమర్జింగ్‌ మార్కెట్లలో యూజర్లు ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల నుంచి మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లలోకి మరులుతున్నారని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పథక్‌ చెప్పారు. అయితే అభివృద్ధి చెందిన మార్కెట్‌లో మాత్రం స్మార్ట్‌ఫోన్‌ డిమాండ్‌ మందగించినట్టు పేర్కొన్నారు. శాంసంగ్‌, ఆపిల్‌ తర్వాత హువావే 10.9 శాతం, షావోమి 7.5 శాతం, ఒప్పో 6.1 శాతం మార్కెట్‌ షేరును సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు