శామ్‌సంగ్‌.. ఫోల్డ్‌ చేసే ఫోను ధర రూ.1.4 లక్షలు  

22 Feb, 2019 04:25 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌.. అధునాతన టెక్నాలజీతో తన మొట్ట మొదటి మడత పెట్టగల (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ఫోల్డ్‌’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది ట్యాబ్‌గా, ఫోన్‌గా కూడా ఉపయోగపడనుందని కంపెనీ వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేయగలిగిన ఈ మొబైల్‌ డిస్‌ప్లే సైజ్‌ 4.6 అంగుళాలు కాగా, మడత విప్పితే 7.3 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ట్యాబ్‌గా మారుతుంది. ఈ ఫోన్‌ ధర 1,980 డాలర్లు. మన కరెన్సీలో దాదాపుగా రూ.1.4 లక్షలు.

గెలాక్సీ ఎస్‌10, ఎస్‌10 ప్లస్‌ విడుదల 
శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో మూడు నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ ఎస్‌10 పేరిట విడుదలైన మొబైల్‌ డిస్‌ప్లే సైజ్‌ 6.1 అంగుళాలు కాగా.. ఇన్‌– స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్, బ్రాండ్‌ న్యూ క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగెన్‌ 855 ప్రాసెసర్‌ ఇందులో ఫీచర్లుగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర 849 డాలర్లు. మన కరెన్సీలో దాదాపుగా రూ.60,000. గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌ పేరిట విడుదలైన మరో స్మార్ట్‌ఫోన్‌లో 12జీబీ ర్యామ్, ఒక టెరాబైట్‌ స్టోరేజ్‌ ఉండగా.. ఈ ఫోన్‌ ధర 999 డాలర్లు (దాదాపు రూ.74,000).  

మరిన్ని వార్తలు